1, డిసెంబర్ 2020, మంగళవారం

TTD News | తిరుమల సమాచారం

వ‌సంత మండ‌పంలో శ్రీ ధాత్రివిష్ణు పూజ‌

         కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా మంగ‌ళ‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో  శ్రీ ధాత్రివిష్ణు పూజ‌ ఘనంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

         ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు, శ్రీ ధాత్రి ( నెల్లికాయ‌) వృక్షాన్నివ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు.

 ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ ధాత్రి అంటే ల‌క్ష్మీ నారాయ‌ణుల రూప‌మన్నారు.  

కార్తీక మాసంలో ధాత్రిని పూజించ‌డం వ‌ల‌న స‌మ‌స్త దేవ‌త‌ల ఆశీర్వాదం ల‌భిస్తుంద‌ని, త‌ద్వారా సంవ‌త్సర కాలం స‌ర్వ‌దోషాలు తొల‌గి, నిత్యం గంగా స్నానం చేసిన ఫ‌లితం సిద్ధిస్తుంద‌ని తెలిపారు. ఉసిరి చెట్టు కింద ఒక బ్రా‌హ్మ‌ణుడికి అన్న‌దానం చేస్తే కోటి మందికి అన్న‌దానం చేసిన ఫ‌లితం వ‌‌స్తుంద‌న్నారు.

అదేవిధంగా ఉసిరి, తుల‌సీ రెండు క‌లిపిన జ‌లాన్ని తీర్థంగా స్వీక‌రిస్తే జ‌న్మ జ‌న్మ‌ల పాపం న‌శిస్తుంద‌ని, మ‌నోవాంచ‌‌లు నెర‌వేరుతాయ‌ని వివ‌రించారు.

         ముందుగా ఘంటా నాదంతో స‌క‌ల దేవ‌త‌‌ల‌ను ఆహ్వా‌నించి, కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి, అష్ట‌దిక్పాల‌కులు, న‌వ‌గ్ర‌హా‌ల అనుగ్ర‌హంతో లోక క్షేమం కొర‌కు ప్రార్థ‌న చేశారు. ఆ త‌రువాత ధాత్రి వృక్షానికి పూజ‌, నివేద‌న‌, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

కామెంట్‌లు లేవు: