JEE Main: జేఈఈ మెయిన్ సిలబస్ తగ్గింపు!
* దరఖాస్తుల ప్రక్రియ షురూ
* నవంబర్ 30 వరకు తుది గడువు
* జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆన్లైన్ పరీక్షలు
* ఎన్టీఏ నోటిఫికేషన్ జారీ
ఈనాడు, హైదరాబాద్: జేఈఈ మెయిన్ తొలి విడతకు దరఖాస్తుల ప్రక్రియ గురువారం మొదలైంది. విద్యార్థులు నవంబర్ 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) గురువారం(నవంబర్ 2) నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో బీటెక్లో చేరేందుకు జేఈఈ మెయిన్లో పేపర్-1, బీఆర్క్లో ప్రవేశానికి పేపర్-2ఏ, బీ-ప్లానింగ్లో ప్రవేశానికి పేపర్-2బీ రాయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పేపర్-1లో 300 మార్కులు(90 ప్రశ్నలు), పేపర్-2ఏలో 400 మార్కులు(82 ప్రశ్నలు), పేపర్-2బీలో 400 మార్కులు(105 ప్రశ్నలు) ఉంటాయి. ఫిబ్రవరి 12న స్కోర్ వెల్లడిస్తారు. ఈ పరీక్షల్లో కనీస స్కోర్ సాధించిన రెండున్నర లక్షల మందికి(అన్ని సామాజికవర్గాల వారిని కలిపి) మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత ఉంటుంది. అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణులైనవారికి మాత్రమే ఐఐటీల్లో చేరేందుకు అవకాశం ఇస్తారు. తుది విడత జేఈఈ మెయిన్ ఏప్రిల్లో నిర్వహిస్తారు. రెండుసార్లు రాస్తే.. ఆ రెండింటిలో ఎక్కువ స్కోర్ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ను దాదాపు 11 లక్షల మంది రాస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఏ నగరం/పట్టణంలో పరీక్ష కేంద్రం కేటాయించారో జనవరి రెండో వారంలో వెల్లడిస్తారు. పరీక్షకు మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులు(హాల్టికెట్) వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
సిలబస్ తగ్గింపు
కరోనా కాలంలో సీబీఎస్ఈ విద్యార్థులకు 9, 10 తరగతులతోపాటు ఇంటర్ లేదా తత్సమాన తరగతిలో సిలబస్ తగ్గించినందువల్ల ఆ ప్రకారం జేఈఈ మెయిన్ పరీక్షలకు కూడా తగ్గించారు. రసాయనశాస్త్రంలో పలు పాఠ్యాంశాలను పూర్తిగా తొలగించారు. భౌతికశాస్త్రం, గణితంలో కొన్ని పాఠ్యాంశాలను పూర్తిగా, మరికొన్నింట్లో పాక్షికంగా తొలగించారు. తొలగించిన పాఠ్యాంశాల వివరాలను జేఈఈ మెయిన్ వెబ్సైట్లో ఎన్టీఏ అందుబాటులో ఉంచిందని, వాటిని పరిశీలించి పరీక్షలకు సిద్ధం కావాలని శిక్షణ నిపుణులు ఉమాశంకర్, కృష్ణచైతన్య తెలిపారు. తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులు మాత్రం వాటిని చదవక తప్పదని పేర్కొన్నారు.