16, ఆగస్టు 2021, సోమవారం

అగ్రికల్చరల్‌ వర్సిటీల్లో డిప్లొమాలు | దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18-08-2021.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రికల్చరల్‌, హార్టికల్చరల్‌, యానిమల్‌ హస్బెండరీ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెంలోని డా.వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలోని వివిధ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. మూడేళ్ల వ్యవధిగల అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా; రెండేళ్ల వ్యవధిగల వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రీయ వ్యవసాయం, పశు పోషణ, మత్స్య శాస్త్రం, ఉద్యాన డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పశు పోషణ, మత్స్య శాస్త్రం కోర్సులను తెలుగు మాధ్యమంలో; మిగిలిన వాటిని ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారు. పంచాయితీ, మునిసిపల్‌ పరిధి పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 75:25 నిష్పత్తిలో సీట్లు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 

సీట్లు: 4230

ఇందులో అగ్రికల్చరల్‌ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. విశ్వవిద్యాలయ అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌లలో వ్యవసాయం 550, విత్తన సాంకేతిక పరిజ్ఞానం 25, సేంద్రీయ వ్యవసాయం 25, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ 60 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌లలో వ్యవసాయం 2460, విత్తన సాంకేతిక పరిజ్ఞానం 480, సేంద్రీయ వ్యవసాయం 120, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ 510 సీట్లు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పదోతరగతిని కంపార్ట్‌మెంటల్‌గా పూర్తిచేసినవారు, ఇంటర్మీడియెట్‌ తప్పినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌, ఆపై అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అనర్హులు. అభ్యర్థుల వయసు ఆగస్టు 31 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: పదోతరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్‌ ఏవరేజ్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందికి సమాన గ్రేడ్‌ వస్తే మొదట సైన్స్‌, తరవాత మేథ్స్‌, ఇంగ్లీష్‌, తెలుగు, సోషల్‌, హిందీలోని గ్రేడ్‌ పాయింట్ల ప్రకారం నిర్ణయిస్తారు. అభ్యర్థి వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.600 (దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300) 

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: విద్యార్థి చదివిన పాఠశాల నుంచి ధృవీకరణ, బదిలీ పత్రాలు; పదోతరగతి సర్టిఫికెట్‌; కులం, వైకల్యం, ఆదాయం, ఎన్‌సీసీ, రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీ స్థాయి క్రీడలలో పాల్గొన్న ధృవీకరణ పత్రాలు

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:  18-08-2021.

వెబ్‌సైట్‌: angrau.ac.in

డా.వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం 

సీట్లు: 480

ఇందులో ఉద్యాన డిప్లొమా కోర్సు ఉంది. విశ్వవిద్యాలయ హార్టికల్చరల్‌ పాలిటెక్నిక్‌లలో కలికిరి (చిత్తూరు) 40, మడకశిర (అనంతపురం) 60, నూజివీడు (కృష్ణా) 40, రామచంద్రాపురం (తూర్పుగోదావరి) 60 సీట్లు ఉన్నాయి. పొదిలి (ప్రకాశం), వేగవరం (పశ్చిమగోదావరి), నెల్లిపర్తి (విజయనగరం), మద్దిరాల (గుంటూరు), ఎచ్చెర్ల (శ్రీకాకుళం), బద్వేల్‌ (డా.వైఎస్సార్‌ కడప), కొయిలకుంట్ల (కర్నూలు)లోని ప్రైవేట్‌ హార్టీకల్చరల్‌ పాలిటెక్నిక్‌లలో ఒక్కోదానిలో 40 సీట్లు ఉన్నాయి. 

శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం 

సీట్లు: 1339

పశు పోషణ (యానిమల్‌ హస్బెండరీ) కోర్సులో మొత్తం 900 సీట్లు ఉన్నాయి. మడకశిర, రాపూర్‌, బనవాసి, గరివిడి, రామచంద్రాపురం, వెంకటరామన్న గూడెం, పలమనేరు, కొమ్మేమర్రి, వెన్నెలవలస, సదుంలోని ‘విశ్వవిద్యాలయ యానిమల్‌ హస్బెండరీ పాలిటెక్నిక్‌’లలో ఒక్కోదానిలో 30 సీట్లు ఉన్నాయి. ఇ అబ్బవరం, కాకినాడ, ఆళ్లగడ్డ, ప్రొద్దుటూరు, పిరిడి, టక్కోలు, జమ్మలమడుగు, ఎచ్చెర్ల, అనంతపురం, కనుమల, వక్కపట్లవారి పాలెం, నరసరావుపేటలోని అనుబంధ పాలిటెక్నిక్‌లలో ఒక్కోదానిలో 50 సీట్లు ఉన్నాయి.  

మత్స్య శాస్త్రం (ఫీషరీ) కోర్సులో మొత్తం 439 సీట్లు ఉన్నాయి. కృష్ణా జిల్లా భావదేవరపల్లిలోని విశ్వవిద్యాలయ ఫిషరీ పాలిటెక్నిక్‌లో 39 సీట్లు; నర్సీపట్నం, కాకినాడ, దారిమడుగు, టక్కోలు, కాకినాడ, పసుపుల, ఎచ్చెర్ల, పొదిలిలోని అనుబంధ పాలిటెక్నిక్‌లలో ఒక్కోదానిలో 50 సీట్లు ఉన్నాయి.

కామెంట్‌లు లేవు: