14, నవంబర్ 2021, ఆదివారం

Currency Notes: చిరిగిన నోట్లను ఏం చేయాలో తెలియడం లేదా.? బ్యాంకులో ఇస్తే కొత్త నోట్లు ఇస్తారని మీకు తెలుసా?

కరెన్సీ నోట్లు చిరగడం సర్వ సాధారణమైన విషయం. 

కరెన్సీ నోట్లు చిరగడం సర్వ సాధారణమైన విషయం. మనలో చాలా మంది చిరిగిన నోట్లను ఏం చేయాలో తెలియక ప్లాస్టర్‌లాంటివి అతికిస్తూ ఎవరికో ఒకరికి తెలియకుండా అంటగట్టడానికి ప్రయత్నిస్తుంటాం. అయితే తీసుకునే వారు గమనించి ఇవి చెల్లవు అంటూ తిరస్కరించే సందర్భాలు కూడా ఉంటాయి. దీంతో చేసేదేమీ లేక నోటును పడేయడమో, నిరుపయోగంగా ఇంట్లోనే ఉంచడమో చేస్తుంటాం. అయితే చిరిగిన నోట్లను బ్యాంకుల్లో ఎక్సేంజ్‌ చేసుకోవచ్చనే విషయం తెలుసా.? తాజాగా ఈ విషయమై ఎస్‌బీఐ ఖాతాదారుడు ఒకరు చేసిన ట్వీట్‌కు బదులుగా ఎస్‌బీఐ వివరణ ఇచ్చింది.

అమిత్‌ కుమార్‌ అనే ఓ ఖాతాదారుడు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ట్విట్టర్‌ ఖాతాను ట్యాగ్ చేస్తూ.. ‘సార్‌.. నా దగ్గర చిరిగిన రూ. 2000 వేల నోటు ఉంది. నేను దానిని రీప్లేస్‌ చేసుకోవాలనుకుంటున్నాను. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ఆధారంగా చిరిగిన నోటును ఎలా మార్చుకోవాలి.? దీనికి సంబంధించిన వివరాలను తెలపండి’ అంటూ ఓ పోస్ట్‌ చేశాడు. దీనిపై స్పందించిన ఎస్‌బీఐ సమాధానంగా మరో ట్వీట్ చేసింది. ‘ఎస్‌బీఐకి చెందిన అన్ని రకాల బ్రాంచీల్లో చిరిగిన నోట్లను ఎక్సేంజ్‌ చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతాదారులతో పాటు ఇతరులు కూడా ఇలాంటి నోట్లను మార్చుకోవచ్చు. చెల్లుబాటులో ఉన్న చిరిగిన నోట్లను బ్యాంకులు తీసుకోవచ్చని ఆర్‌బీఐ అనుమతులు ఇచ్చింది. అయితే నోట్లలో తేడా కనిపించినా.? దొంగ నోట్లని తేలినా.. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో వాటిని స్వీకరించవు’ అని స్పష్టతనిచ్చింది.

Gemini Internet

ఆర్‌బీఐ మార్గదర్శకాలు ఏంటంటే..

నోటుకు రెండు వైపులా స్పష్టంగా నెంబర్లు కనిపిస్తూ రెండుగా చిరిగిన నోటునైనా ఎక్సేంజ్‌ చేసుకోవచ్చు. ఇలాంటి నోట్లను ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకు లేదా ప్రైవేటు రంగ బ్యాంకునైనా సంప్రదించి కరెన్సీని ఎక్సేంజ్‌ చేసుకోవచ్చు. వీటితో పాటు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఇష్యూ కార్యాలయంలో ఎక్కడైనా నోట్లను మార్చుకోవచ్చు. దీని కోసం ఎలాంటి అప్లికేషన్‌ ఫామ్‌ను నింపాల్సిన అవసరం లేదు.