13, నవంబర్ 2021, శనివారం

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో క్యాలెండర్‌ డైరీలు అందుబాటులోకి

టీటీడీ 2022 సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. క్యాలెండర్లు కావాల్సిన భక్తులు దేవస్థానం వెబ్‌సైట్‌లోని పబ్లికేషన్స్‌ నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. పోస్టల్‌ ఛార్జీలు చెల్లించి కావాల్సినన్ని డైరీలు, క్యాలెండర్లను అడ్రస్‌కు పంపిస్తారు. భారతదేశంతో పాటు అంతర్జాతీయంగా వీటిని పొందే అవకాశాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. పెద్ద డైరీ రూ.150 కాగా.. చిన్న డైరీ రూ.120కు లభిస్తుంది. క్యాలెండర్‌ రూ.130గా ఉంది. టేబుల్‌ క్యాలెండర్‌ రూ.75తో పాటు పోస్టల్‌ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

మరోవైపు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న సర్టిఫికెట్‌ లేదా, మూడురోజుల ముందు కరోనా పరీక్ష చేసుకున్న నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలని సూచించింది. మొదటి డోసు పూర్తయిన వారు కూడా దర్శనానికి రావొచ్చు.. భక్తుల సంఖ్యను పెంచడంతో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు నూతన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ఇటు టీటీడీ దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో మాత్రమే విడుదల చేస్తోంది. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన టోకెన్ల సంఖ్యను కూడా పెంచింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు.. రోజుకు 12వేల చొప్పున.. సర్వదర్శన టోకెన్లు రోజుకు 10వేల చొప్పున విడుదల చేశారు. అలాగే అద్దె గదులు కూడా విడుదలయ్యాయి.

కామెంట్‌లు లేవు: