ఇక 10వ తరగతి తరువాత 11 మరియు 12 తరగతులుగా ఇంటర్ | త్వరలో ఇంటర్ బోర్డు స్కూల్ బోర్డులోకి విలీనం


♦️విలీన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు

♦️ఎన్‌ఈపీ, సీబీఎస్‌ఈ అమలుకు ఒకే విభాగం

🌻ఈనాడు, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేయనున్నారు. ఇందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 1971లో ఏర్పాటైన ఇంటర్‌ విద్యామండలి ఇక కనుమరుగు కానుంది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ పరీక్షల విభాగంలోనే రెండు శాఖల అధికారులుంటారు. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 5+3+3+4లో చివరి నాలుగేళ్లు 9, 10, 11, 12 తరగతులు ఉంటాయి. వీటికి సంబంధించి కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ప్రత్యేకంగా అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎన్‌ఈపీ అమలు, ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం ప్రవేశపెట్టడం, ఉన్నత పాఠశాలల్లో ప్లస్‌టూను ఎలాగూ ప్రారంభిస్తున్నందున ఈ విలీనానికి నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా కసరత్తు సాగుతోంది. అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల నియామకాలు, సర్వీసు నిబంధనలు, కొత్తగా ఏ విభాగాలు ఏర్పాటు చేయాలనే అంశాలపై చర్చిస్తున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పదోన్నతుల్లో, సర్వీసు నిబంధనల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

♦️విలీన ప్రతిపాదన ఇలా..
ఇంటర్మీడియట్‌లోని విద్యా పరిశోధన, శిక్షణ మండలిని పాఠశాల విద్యలోని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలిలో (ఎస్‌సీఈఆర్టీ) విలీనం చేస్తారు. ఇంటర్‌ వృత్తి విద్యా కోర్సులను సమగ్రశిక్ష అభియాన్‌లో నిర్వహిస్తున్న వృత్తి విద్యా కోర్సుల్లో కలిపేస్తారు. పాఠశాల విద్య, ఇంటర్‌ విద్యకు కలిపి కొత్తగా డైరెక్టర్‌ అకడమిక్‌, డైరెక్టర్‌ పరిపాలన, డైరెక్టర్‌ అకౌంట్స్‌ విభాగాలను ఏర్పాటు చేస్తారు.
వీటి కిందికి 2 శాఖల్లోని వారిని తీసుకొస్తారు.

* ప్రస్తుతం పాఠశాల విద్యలో 4 ప్రాంతీయ సంయుక్త సంచాలకుల (ఆర్జేడీ) పోస్టులుండగా.. ఇంటర్‌లో మూడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో కొత్తగా ఇంటర్‌ ఆర్జేడీ పోస్టును ఏర్పాటు చేస్తారు. ఇద్దరు ఆర్జేడీలు ఉంటే 9నుంచి 12వ తరగతి వరకు ఒకరు పర్యవేక్షిస్తారు. ఇంటర్‌ విద్యా మండలిలోని సిబ్బందిని ప్రభుత్వ పరీక్షల విభాగంలో విలీనం చేస్తారు. పది, ఇంటర్మీడియట్‌కు ఈ బోర్డే పరీక్షలు నిర్వహిస్తుంది.

* రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 434 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 292 కళాశాలలను ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసి ‘హైస్కూల్‌ ప్లస్‌’గా పిలుస్తారు. ఇక్కడ ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీలో ఉపాధ్యాయులు, జూనియర్‌ లెక్చరర్లకు అవకాశమిస్తారు. జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్‌ పోస్టును జోనల్‌ పోస్టుగా మార్పు చేయనున్నారు. హైస్కూల్‌ ప్లస్‌లో అర్హత కలిగిన ఉపాధ్యాయులను పదోన్నతుల ద్వారా లెక్చరర్లుగా నియమించాలని భావిస్తున్నారు. ప్రస్తుతమున్న జూనియర్‌ కళాశాలల్లో 90శాతం నేరుగా నియామకాలు, 10శాతం బోధనేతర సిబ్బందిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. హైస్కూల్‌ ప్లస్‌లో ప్రాథమికంగా ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.

* ఇంటర్మీడియట్‌కు జిల్లాలో ఆర్‌ఐఓ, డీవీఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులు ఉండగా, కొత్త జిల్లాలు ఏర్పడినందున జిల్లాకు ఒక డీవీఈఓ పోస్టును మాత్రమే ఉంచుతారు. క్షేత్రస్థాయిలో హైస్కూల్‌ ప్లస్‌ను ఎవరు పర్యవేక్షించాలనే అంశంపై నిర్ణయానికి రాలేదు.

 

Gemini Internet

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh