11, నవంబర్ 2022, శుక్రవారం

Ganit Challenge: సీబీఎస్‌ఈ ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ అప్లికేషన్స్ ప్రారంభం.. అర్హత, ఎగ్జామ్ ప్రాసెస్ వివరాలు..


Ganit Challenge: విద్యార్థుల్లో గణిత సామర్థ్యం ఏమేరకు ఉందో అంచనా వేయడానికి సీబీఎస్‌ఈ(CBSE) ఏటా ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ (ఏజీసీ) పోటీలను నిర్వహిస్తోంది. అయితే ఈ ఏడాదికి సంబంధించిన ఏజీసీ పరీక్ష కోసం తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. బోర్డు అనుబంధ స్కూల్స్‌లో 8 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ టెస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్స్ cbse.nic.in, bseacademic.nic.in ద్వారా నవంబర్ 15 సాయంత్రం 5లోపు అప్లై చేసుకోవచ్చు.
ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ టెస్ట్‌ను రెండు లెవల్స్‌లో నిర్వహించనున్నారు. మొదటిది స్కూల్ లెవల్ పెన్ పేపర్ మోడ్‌లో జరగనుంది. ఇక సెకండ్ లెవల్‌ను సీబీఈఎస్‌ఈ జాతీయ స్థాయిలో నిర్వహిస్తుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) రూపంలో ఉంటుంది. మొదటి దశకు సంబంధించిన పరీక్ష కోసం అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఏజీసీ పరీక్ష వ్యవధి రెండు దశల్లో గంటపాటు ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQs) ఉంటాయి. మొత్తం వెయిటేజీ 40 మార్కులు. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు. రిజిస్టర్డ్ స్కూల్స్‌కు ప్రశ్నపత్రంతో పాటు ఆన్సర్ కీ నవంబర్ 16 నుంచి నవంబర్ 24 మధ్య అందుబాటులో ఉంటుంది. అయితే సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. మొదటి దశలో నమోదు చేసుకున్న ప్రతి అనుబంధ పాఠశాల నుంచి మొదటి ముగ్గురు విద్యార్థులు మాత్రమే AGC లెవల్ 2 పోటీకి అర్హత పొందుతారు.
ఏజీసీ రెండో లెవల్ పరీక్షను డిసెంబర్ 15న నిర్వహించనున్నారు. ఇందు కోసం నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 మధ్య ఆన్‌లైన్‌ ఫీజు రూ.900 చెల్లించి మొదటి ముగ్గురు విద్యార్థుల పేర్లను స్కూల్స్ రిజిస్టర్ చేసుకోవాలి. రెండో లెవల్‌లో కంప్యూటర్ పరీక్ష విజయవంతంగా పూర్తయిన తర్వాత, ప్రతి CBSE రీజియన్ నుంచి మొదటి 100 మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికేట్ ప్రదానం చేయనున్నారు.

కామెంట్‌లు లేవు: