1, డిసెంబర్ 2022, గురువారం

ఇక తిరుపతిలోనేశ్రీవాణి దర్శనం టికెట్లు


• మాధవం అతిథిగృహంలో కౌంటర్లు ఏర్పాటు
తిరుపతి అలిపిరి/తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్లైన్ టికెట్లను బుధవారం నుంచి తిరుపతిలోనే మంజూరు చేస్తున్నారు. మాధవం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లను వీరబ్రహ్మంప్రారంభించారు. జేఈవో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలువిరాళం ఇచ్చి.. రూ.500 చెల్లించే భక్తులకు ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్లైన్ టికెట్లు జారీ చేస్తూ వచ్చామన్నారు. దాతలు ముందు రోజు తిరుమలకు వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. దాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించిన టీటీడీ.. ఇకపై శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్లను తిరుపతిలోనే జారీ చేసి ఇక్కడే వారికి వసతి గదులు కేటాయించేలా నిర్ణయం తీసుకుందని చెప్పారు. కౌంటర్ల నిర్వహణకు ముందుకొచ్చిన యూనియన్ బ్యాంకు యాజమాన్యానికి
కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ రాంప్రసాద్, చీఫ్ మేనేజర్లు బ్రహ్మయ్య. నగేష్, వీజీవో మనోహర్, డిప్యూటీ ఈవో పార్వతి, ఈఈ కృష్ణారెడ్డి, ఏఈవో ధనుంజయులు పాల్గొ న్నారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 27 క్యూ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 30 గంటల సమయంపడుతోంది. కాగా, బుధవారం శ్రీవారిని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ఏకే జైన్, సినీ గాయకుడు శ్రీరామచంద్రదర్శించుకున్నారు.

కామెంట్‌లు లేవు: