7, ఫిబ్రవరి 2023, మంగళవారం

విద్యార్థుల కోసం ఆధార్ క్యాంపులు✍️📚♦️. జూనియర్ కాలేజీల్లో నేటి నుంచి 4 రోజులపాటు నిర్వహణ♦️. గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ప్రతినెలా క్యాంపులు♦️.10 రకాల ఆధార్ సేవలకు వీలు


🌻సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు ఆధార్‌ కార్డుల్లో బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి 4రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 1,485 ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలలో ప్రత్యేక ఆధార్‌ క్యాంపుల నుంచి నిర్వహించనుంది. కనీసం పదేళ్ల వ్యవధిలో ఒక్కసారైనా ఆధార్‌ కార్డులో బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని యూఐడీఏఐ నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో పదేళ్ల వ్యవధిలో ఒక్కసారి కూడా తమ ఆధార్‌ కార్డులో బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోనివారు దాదాపు 80 లక్షల మంది ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ప్రతినెలా ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 7 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయస్సు వారికి ప్రభుత్వం పూర్తి ఉచితంగా బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది.

ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ 15 ఏళ్లలోపు వయసు కలిగిన విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహిస్తూ వచ్చింది. ఈ నెలలో 15నుంచి 17 ఏళ్ల వయసులోపు విద్యార్థులకు జూనియర్‌ కాలేజీల్లో క్యాంపులు నిర్వహిస్తోంది.

సచివాలయాల్లో నిర్వహించే ప్రత్యేక ఆధార్‌ క్యాంపుల్లో ఆధార్‌ కార్డులో బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ సేవలను ఉచితంగా అందజేయడంతో పాటు నిర్ణీత రుసుంతో అదనంగా మరో 10 రకాల ఆధార్‌ సేవలను పొందే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బయోమెట్రిక్‌ (ఫొటో, ఐరిస్, ఫింగర్‌ ప్రింట్‌) అప్‌డేట్, పేరు మార్పు, పుట్టిన తేదీ వివరాల మార్పు, జెండర్, చిరునామా మార్పు సేవలతో పాటు కొత్తగా ఆధార్‌ వివరాల నమోదు, ఆధార్‌ కార్డు డౌన్‌లోడ్‌ సేవలను కూడా ఆ క్యాంపుల్లో పొందవచ్చు.

కామెంట్‌లు లేవు: