11, జూన్ 2020, గురువారం

🔳కంటి వెలుగును కాపాడే కొలువులు! ఇంటర్‌ తర్వాత ఆప్టోమెట్రీ కోర్సులు కంటి వెలుగును కాపాడే కొలువులు!

ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందితో కంటి ఆసుపత్రికి వెళితే ముందుగా బోర్డు మీద విభిన్న పరిమాణాల్లో ఉన్న  అక్షరాలను చదవమని అడుగుతారు. కనిపించకపోయినా.. కాస్త  మసక అనిపించినా.. రకరకాల ఆప్టిక్స్‌ పెట్టి పరీక్షిస్తుంటారు. ఆ తర్వాతే ప్రధాన వైద్యుడిని కలవడానికి పంపుతారు. వాళ్లే ఆప్టోమెట్రీషియన్లు. నాణ్యమైన జీవనానికి అవసరమైన కంటి చూపును  కాపాడటంలో  వీరి పాత్ర ప్రధానమైంది.  ఆధునిక యుగంలో మారిన జీవనశైలి వల్ల ఇలాంటి నిపుణుల అవసరాలు ఎక్కువయ్యాయి. ఈ ఉద్యోగాల్లోకి ప్రవేశించాలంటే ఆప్టోమెట్రీ డిప్లొమా లేదా డిగ్రీ పొంది ఉండాలి. ఇంటర్మీడియట్‌ అర్హతతో విద్యార్థులు ఆ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కంటి వెలుగును కాపాడే కొలువులు!

కంటి వెలుగును కాపాడే కొలువులు!

ప్రతి జీవికీ ప్రధానమైనది కన్ను. ఏ పనైనా ఎలాంటి ఇబ్బందీ లేకుండా సక్రమంగా సాగిపోవాలంటే కళ్లు కచ్చితంగా బాగుండాలి. అన్ని వయసుల వారూ దాదాపు ఏదో ఒక కంటి ఇబ్బందితో ఉంటారని అంచనా. లోపం ఎలాంటిదైనా పరీక్షలు జరపాలి. తగిన చికిత్సను అందించాలి. ఈ కంటి పరీక్షలను ప్రాథమిక స్థాయిలో క్షుణ్ణంగా నిర్వహించేవాళ్లు ఆప్టోమెట్రీషియన్లు. వీళ్లు చేసే టెస్ట్‌ల  ఆధారంగానే తర్వాతి దశలో చికిత్సలు మొదలవుతాయి. కంప్యూటర్లు, మొబైళ్ల వంటి ఆధునిక పరికరాల వినియోగం కళ్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. చిన్న వయసులోనే   పలు రకాల కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి పరిష్కారాలను ప్రాథమిక దశలో   ఆప్టోమెట్రీ కోర్సులు చదివిన అభ్యర్థులు చూపుతారు. కొన్ని ఆప్టిక్‌లను వినియోగించి  కంటి చూపుపై సరైన అంచనాకు వస్తారు. ఆ సమయంలో నమోదు చేసే వివరాలే చికిత్సకు కీలకమైనవి. ఆ పరిశీలనలను డాక్టర్‌కు వివరిస్తారు. వాటి ఆధారంగానే అవసరమైన మందులు, లెన్స్‌లు, ఇతర సూచనలను వైద్యులు అందిస్తారు. ఈ ప్రక్రియ మొత్తంలో మొదటి దశలో కీలంగా పనిచేసేవారే ఆప్టోమెట్రీషియన్లు. దాదాపు ప్రతి కంటి ఆసుపత్రిలోనూ వీళ్లు ఉంటారు. ఆసక్తి ఉన్న వాళ్లు ఇంటర్మీడియట్‌ అర్హతతో ఆప్టోమెట్రీ కోర్సులు చేయవచ్చు.

డిప్లొమా.. డిగ్రీ

కంటి వెలుగును కాపాడే కొలువులు!

ఇంటర్‌ విద్యార్హతతో ఆప్టోమెట్రీలో డిప్లొమా, బ్యాచిలర్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.   ఇంటర్‌ అన్ని గ్రూపుల వారూ డిప్లొమాలో చేరవచ్చు. వ్యవధి రెండేళ్లు. అది పూర్తిచేసుకున్నవారు ఆప్టోమెట్రీ యూజీ కోర్సులో నేరుగా రెండో ఏడాదిలోకి ప్రవేశించవచ్చు. ఈ అవకాశం కొన్ని సంస్థల్లోనే లభిస్తుంది. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ వ్యవధి నాలుగేళ్లు. రాష్ట్ర స్థాయి సంస్థల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ లేదా బీఎస్సీ ఆప్టోమెట్రీలో చేరాలంటే ఇంటర్మీడియట్‌ బైపీసీ గ్రూపుతో ఉత్తీర్ణులై ఉండాలి. జాతీయస్థాయి, పేరున్న సంస్థలు మాత్రం బైపీసీతోపాటు ఎంపీసీ వారికీ అవకాశం కల్పిస్తున్నాయి. ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు నాలుగేళ్ల యూజీ కోర్సులో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. నాలుగేళ్ల కోర్సులో చివరి ఏడాది మొత్తం ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఏదైనా కంటి ఆసుపత్రిలో దీన్ని చేయాలి. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పలు సంస్థలు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. తర్వాత ఆసక్తి ఉన్నవారు రెండేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీలో చేరవచ్చు. అనంతరం పీహెచ్‌డీకీ అవకాశాలు ఉన్నాయి. బీ-ఆప్టోమెట్రీ అందించే సంస్థల్లో కొన్ని పీజీ, పీహెచ్‌డీలనూ నిర్వహిస్తున్నాయి. దేశంలోని ప్రసిద్ధ నేత్ర వైద్యశాలలూ యూజీ, పీజీ,  పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ స్థాయుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. యూజీ విద్యార్థులకు ఏడాది ఇంటర్న్‌షిప్‌ అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. ఇంటర్‌ బోర్డు లేదా ఓపెన్‌ విధానంలో బైపీసీ గ్రూపు చదివినవారు;  బయాలజీ, ఫిజిక్స్‌ల్లో బ్రిడ్జ్‌ కోర్సు పూర్తిచేసుకున్న ఒకేషనల్‌ విద్యార్థులు రాష్ట్ర స్థాయి సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ప్రారంభమైన సంవత్సరం డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండడం తప్పనిసరి. ఇంటర్‌ మార్కుల ఆధారంగా అడ్మిషన్‌ ఇస్తారు. ప్రకటనలు జూన్‌ లేదా జులైల్లో వెలువడతాయి. జాతీయ స్థాయి సంస్థలు ప్రత్యేక ప్రవేశ పరీక్ష లేదా నీట్‌ స్కోర్‌తో చేర్చుకుంటున్నాయి.

ఏయే నైపుణ్యాలు?
ఆప్టోమెట్రిస్ట్‌గా సేవలు అందించాలకునే వారికి దృష్టిలోపం ఉండకపోతే మంచిది. సహనం, సమన్వయంతో వ్యవహరించడం, చురుగ్గా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు ఉన్నవారు ఇందులో రాణించే అవకాశం ఉంది. కోర్సులో భాగంగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రో బయాలజీ, ఆప్టిక్స్‌పై అవగాహన కల్పిస్తారు. క్లినికల్‌ ఆఫ్తాల్మాలజీకి చెందిన ప్రాథమికాంశాల గురించీ తెలుసుకుంటారు. ఈ సబ్జెక్టుల నుంచి ఆప్టోమెట్రీకి అవసరమైన అనువర్తనాలను అధ్యయనం చేస్తారు.
ఉద్యోగావకాశాలు
దేశంలో పది కోట్ల మంది ఏదో ఒక దృష్టి లోపంతో బాధపడుతున్నారని అంచనా. తగిన సేవలు అందించడానికి కనీసం లక్ష మంది ఆప్టోమెట్రీషియన్లు అవసరం. కానీ అంతమంది ప్రస్తుతం మనదేశంలో లేరు. ఈ విభాగంలో డిగ్రీ చేస్తే  ప్రభుత్వ కంటి ఆసుపత్రుల్లో ఆకర్షణీయ వేతనంతో ఆప్టోమెట్రీషియన్లుగా సేవలు అందించవచ్చు. ఎక్కువ ఉద్యోగాలు కార్పొరేట్‌ కంటి ఆసుపత్రులు, కార్పొరేట్‌ కళ్లద్దాల విక్రయ శాలలు, ప్రైవేటు ఆసుపత్రులు, ఎన్జీవోల్లో        లభిస్తాయి. కొంత అనుభవం వచ్చిన తర్వాత సొంతంగా కళ్లద్దాల దుకాణం నిర్వహించుకోవచ్చు. ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌, మ్యాక్సీ విజన్‌, వాసన్‌ ఐ కేర్‌, అగర్వాల్‌ ఐ హాస్పిటల్‌ తదితర కార్పొరేట్‌ కంటి ఆసుపత్రుల్లో వీరి సేవలు వినియోగించుకుంటారు. కంటివైద్యులు సేవలందిస్తున్న ప్రతిచోటా ఆప్టోమెట్రీషియన్లు దాదాపు ఉంటారు. టైటాన్‌ ఐ ప్లస్‌, లెన్స్‌కార్ట్‌, లారెన్స్‌ అండ్‌ మేయో, విజన్‌ ఎక్స్‌ప్రెస్‌, జీకేబీ తదితర  కార్పొరేట్‌ ఆప్టికల్‌ దుకాణాల్లోనూ వీరి సేవలు అవసరమవుతాయి. పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసుకున్నవారికి బోధన రంగంలో అవకాశాలు లభిస్తాయి.

ఇవీ సంస్థలు

కంటి వెలుగును కాపాడే కొలువులు!

*హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆరేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ (ఎం-ఆప్టోమ్‌) కోర్సు అందిస్తోంది. ఇందులో 28 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులు చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు తప్పనిసరి. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. ప్రకటన వెలువడింది. జూన్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.  రాత పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది. వంద మార్కులకు జనరల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి.
* అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) న్యూదిల్లీ, రిషికేశ్‌ క్యాంపస్‌ల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ కోర్సు అందిస్తున్నారు. ఈ రెండు సంస్థల్లో కలిపి 34 సీట్లు ఉన్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం  లభిస్తుంది. ఈ సంస్థల్లో చేరిన విద్యార్థులకు నెలకు రూ.500 స్ట్టైపెండ్‌  చెల్లిస్తారు. నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌లో ప్రతి నెల రూ. 10,250 అందుతుంది. బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. విద్యార్థులు బయాలజీ లేదా మ్యాథ్స్‌ల్లో ఒక సబ్జెక్టు ప్రశ్నలకు జవాబులు రాస్తే సరిపోతుంది.
* శంకర నేత్రాలయ, చెన్నై ఆధ్వర్యంలో నడుస్తున్న ఎలైట్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీలో బ్యాచిలర్‌, మాస్టర్‌, డాక్టరేట్‌ స్థాయి కోర్సులున్నాయి.బ్యాచిలర్స్‌లో చేరినవారు మొదటి రెండేళ్లు శస్త్ర యూనివర్సిటీ, తంజావూరులో చదువుతారు. తర్వాత రెండేళ్లు ఎలైట్‌ స్కూల్‌, శంకర నేత్రాలయలో చదువు, ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేస్తారు. ప్రవేశం నీట్‌ స్కోర్‌, ఇంటర్‌ మార్కులతో ఉంటుంది లేదా శస్త్ర నిర్వహించే రాత పరీక్షలో మెరిట్‌ సాధించాలి. ఈ కోర్సులకు బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడింది. ఆసక్తి ఉన్నవారు శస్త్ర వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.
* ఆప్టోమెట్రీలో యూజీ, పీజీలను మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూలతో ప్రవేశం లభిస్తుంది. బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.
* ఆప్టోమెట్రీ మూడేళ్ల కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌ను హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్‌ల్లోని ఎల్‌వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌ క్యాంపస్‌ల్లో చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది. ఈ సంస్థ వివిధ మాడ్యూళ్లలో పీజీ డిప్లొమా ఇన్‌ ఆప్టోమెట్రీ అండ్‌ విజన్‌ సైన్సెస్‌ కోర్సులను 18 నెలల వ్యవధితో అందిస్తోంది. ఆప్టోమెట్రీలో బ్యాచిలర్‌ కోర్సులు చదివినవారు వీటికి అర్హులు.
* అమృత విశ్వవిద్యాపీఠం, కొచ్చి క్యాంపస్‌లో ఆప్టోమెట్రీ కోర్సు ఉంది. రాత పరీక్ష ఆధారంగా అడ్మిషన్‌ ఇస్తారు.
* భారతీ విద్యాపీఠ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ, పుణెలో యూజీ, పీజీలు ఉన్నాయి.
* గీతం, విశాఖపట్నం క్యాంపస్‌లో ఆప్టోమెట్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
* ఆంధ్రప్రదేశ్‌లో బీ-ఆప్టోమెట్రీని కర్నూల్‌ మెడికల్‌ కాలేజీ, ఆంధ్రా మెడికల్‌ కాలేజీ, సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ, కోనసీమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌-అమలాపురం, బొల్లినేని మెడ్‌ స్కిల్స్‌ శ్రీకాకుళం (రాగోలు), జీఎస్‌ఎల్‌ పారామెడికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌-రాజమండ్రి, సమత స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ-విశాఖపట్నం (వేపగుంట)ల్లో అందిస్తున్నారు. ఇంటర్‌ బైపీసీ మార్కుల ఆధారంగా ప్రవేశాలుంటాయి. జులైలో ప్రకటన వెలువడుతుంది.

దరఖాస్తు చేశారా?

కంటి వెలుగును కాపాడే కొలువులు!

*సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ఫెలోషిప్‌
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత. చివరి తేది: జూన్‌ 04, 2020.
* ఏఐఏపీజీసెట్‌-2020
అర్హత: బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/ బీఎస్‌ఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌ ఉత్తీర్ణత, ఇంటర్న్‌షిప్‌ చేసి ఉండాలి. చివరి తేది: జూన్‌ 05, 2020.
* ఏపీ డీఈఈసెట్‌-2020
అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత.
చివరి తేది: జూన్‌ 05, 2020.
* ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో వివిధ ఖాళీలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎల్‌ఎల్‌బీ; బీసీఏ/ ఎంసీఏ/ ఎంఎస్సీ, ఎంబీఏ; ఇతర పీజీ డిగ్రీల్లో ఉత్తీర్ణత, అనుభవం. చివరి తేది: జూన్‌ 10, 2020.
* సీఎంటీఐ, బెంగళూరులో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణత.
చివరి తేది: జూన్‌ 12, 2020.

🔳ఎయిమ్స్‌, భోపాల్‌

భోపాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 155. పోస్టులు: ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.
వెబ్‌సైట్‌: https://www.aiimsbhopal.edu.in/

🔳ఐఏఎస్‌ఎస్‌టీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

గువాహటిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఏఎస్‌ఎస్‌టీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 14 పోస్టులు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, సీనియర్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://iasst.res.in/

🔳పాఠశాల విద్యార్థుల సిలబస్‌ తగ్గింపు? అభిప్రాయాలు కోరిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరాన్ని పాఠశాల విద్యార్థులు నష్టపోకుండా పలు చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. సిలబస్‌, బోధనా సమయాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ‘సిలబస్‌ఫర్‌స్టూడెంట్స్‌2020’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకోవాలన్నారు.

రోటరీ ఇండియాతో కలిసి ఈ-లెర్నింగ్‌ పాఠాల తయారీ
1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ-లెర్నింగ్‌ పాఠాలను తమ టీవీ ఛానళ్ల ద్వారా ప్రసారం చేసేందుకు... రోటరీ ఇండియాతో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) చేతులు కలిపింది. ఆధునిక సాంకేతికత, నవకల్పన పునాదులపై సరికొత్త విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్టు నిశాంక్‌ చెప్పారు. విద్యాదాన్‌ పథకం కింద రోటరీ సంస్థ 1-12 తరగతుల పాఠ్యాంశాలన్నింటినీ హిందీ భాషలో అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే నెల నుంచి మొత్తం 12 ఎన్‌సీఈఆర్‌టీ ఛానళ్ల ద్వారా ఈ పాఠాలను ప్రసారమవుతాయి.

🔳రేపటి నుంచి సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ 10 Jun, 2020 03:47 IST|Sakshi

కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో వివిధ ప«థకాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
జేసీ పూర్తి బాధ్యత తీసుకోవాలి.. కలెక్టర్లు పర్యవేక్షించాలి

జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో ‘స్పందన’పై వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ 

వర్షాలు ప్రారంభమయ్యే నాటికి 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ చేయాలి

జూన్‌ చివరి నాటికి రోజుకు 3 లక్షల టన్నులు లక్ష్యంగా పెట్టుకోవాలి

కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి కనీసం 50 ఎకరాల మేర స్థలాన్ని త్వరగా అప్పగించాలి

గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై రోజు వారీ సమీక్ష నిర్వహించాలి

మద్యం, ఇసుక అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపితేనే తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తును అందించగలుగుతాం. కుటుంబాల్లో ప్రేమ, అనురాగాలను నింపగలుగుతాం. మద్యం, ఇసుక అక్రమాల్లో ఎవరున్నా కూడా ఉపేక్షించొద్దు. సీఎం మీతో ఉన్నాడు.. దూకుడుగానే ఉండండి.  

రెండు వారాల క్రితం 35 లక్షల మంది ఉపాధి హామీ పనులకు వచ్చే వారని, ఇప్పుడు 54.5 లక్షల మంది వస్తున్నారని చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పనులు కల్పిస్తున్నందుకు కలెక్టర్లను అభినందిస్తున్నా. వచ్చే సమీక్షా సమావేశం నాటికి కనీసం 60 లక్షల మందికి పనులు కల్పించాలి.

కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలను తొలగించాలి. కరోనా అని అనుమానం రాగానే ఎవరికి కాల్‌ చేయాలి.. ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి.. పాజిటివ్‌ వస్తే ఎలాంటి వైద్యం చేయించుకోవాలి.. అనే కీలక విషయాలపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించాలి. ఇది చేస్తేనే వైరస్‌ అనుమానితులు ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటారు. ఏ ఇబ్బందీ ఉండదు. అప్పుడే మరణాల సంఖ్య బాగా తగ్గుతుంది. లేకపోతే అది ముదిరి ప్రాణాల మీదకు వస్తుంది.

సాక్షి, అమరావతి: గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను బుక్‌ చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. సొంత అవసరాల కోసం గ్రామాల్లో ఉన్న వాళ్లు పక్కనే ఉన్న రీచ్‌ల నుంచి ఎడ్ల బండ్ల ద్వారా 5 కి.మీ పరిధిలో ఇసుకను తెచ్చుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించిన జీవో విడుదల అవుతుందని, గ్రామ సచివాలయంలో అనుమతులు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన వివిధ పథకాలపై తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి. 

అన్ని ఇసుక రీచ్‌లనూ ఓపెన్‌ చేయాలి
► వర్షాలు ప్రారంభం అయ్యే నాటికి 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ చేయాలి. జూన్‌ చివరి నాటికి రోజుకు 3 లక్షల టన్నుల ఇసుక నిల్వ లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రస్తుతం లక్షన్నర టన్నుల వరకూ ఇస్తున్నాం.
► శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇసుక ఉత్పత్తిని బాగా పెంచాలి. అన్ని రకాల రీచ్‌లను తెరవాలి. కొత్త సోర్స్‌లను గుర్తించాలి.
► బల్క్‌ బుకింగ్‌ అనుమతులు జాయింట్‌ కలెక్టర్‌ చూసుకోవాలి. ఈ విధానం పారదర్శకంగా ఉండాలి. ఇందుకు సంబంధించిన ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌) రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. వర్షాలు వస్తున్నందున మళ్లీ ఇసుకకు ఇబ్బందులు రాకుండా ఇప్పుడే చర్యలు తీసుకోవాలి. 

ఇళ్ల స్థలాల పంపిణీ చిరస్మరణీయం
► ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్త వారితో కలిపి 30.30 లక్షల మందికిపైగా లబ్ధిదారులుండొచ్చు. వీరందరికీ  జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకోవాలని చెప్పాం. జూన్‌ 12 కల్లా లబ్ధిదారుల తుది జాబితాను డిస్‌ప్లే చేయాలి. 
► జూన్‌ 15 నాటికి పాత, జూన్‌ 30 నాటికి కొత్త లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమాలు పూర్తి చేయాలి. ఏమైనా సమస్యలు ఉంటే కచ్చితంగా ప్లాన్‌ బి ఉండాలి. జూన్‌ 15 నాటికి ప్లాన్‌ బి కూడా సిద్ధంగా ఉండాలి. జూలై 8న అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలి. 
► సంతృప్త స్థాయిలో మనం ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్లు ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి కలెక్టర్‌ను ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ఇది చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియలో చివరి దశకు వచ్చాం. కొత్త అప్లికేషన్లు వచ్చినప్పటికీ అదే ఉత్సాహంతో వారికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నించాలని కోరుతున్నా.  

ఇ–క్రాప్‌ బుకింగ్‌ కీలకం
► ఇ–క్రాప్‌ బుకింగ్‌ 100 శాతం కచ్చితత్వంతో జరగాలి. వ్యవసాయ అసిస్టెంట్, రెవెన్యూ అసిస్టెంట్‌ ద్వారా ఇ–క్రాప్‌ బుకింగ్‌ చేయించాలి. తప్పులు లేకుండా పారదర్శకంగా జరగాలి. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ప్రయోజనాలకు ఇ– క్రాప్‌ బుకింగ్‌ అనేది పునాదిగా నిలుస్తుంది. 
► కనీస గిట్టుబాటు ధర పొందడానికి ఈ విధానం చాలా కీలకం. ప్రకృతి వైపరీత్యాలు వస్తే, ఆదుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పంట రుణాలకు, ఇన్సూరెన్స్‌కు కూడా ఉపకరిస్తుంది. 
► ఉద్యాన పంటలకు ప్రత్యేక అప్లికేషన్‌ ఉంది. ఆక్వాను కూడా ఇ–క్రాపింగ్‌లో ప్రత్యేక అప్లికేషన్‌లో పెడుతున్నాం. మార్కెటింగ్‌లో ఇది కీలకం కాబోతుంది. 

నాడు–నేడుపై జేసీ నిత్యం పర్యవేక్షించాలి
► అభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్న జేసీ స్కూళ్లలో నాడు– నేడు కార్యక్రమాలను ప్రతిరోజూ పర్యవేక్షించాలి. ఏం కావాలన్నా వెంటనే చర్యలు తీసుకోవాలి. పనులు మాత్రం వేగంగా జరగాలి.
► 15 కొత్త మెడికల్‌ కాలేజీలను మనం కట్టబోతున్నాం. ఇందుకు సంబంధించిన స్థలాలను హేండోవర్‌ చేయాల్సి ఉంది. ఒక్కో కాలేజీ కోసం కనీసం 50 ఎకరాలు గుర్తించాలి. 
► వచ్చే సమీక్షా సమావేశం నాటికి రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు), అంగన్‌వాడీ కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్, మెడికల్‌ కాలేజీలకు సంబంధించి భూముల గుర్తింపు పూర్తి కావాలి.
► గ్రామ సచివాలయాలు, వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌పై మరింతగా దృష్టి పెట్టాలి. వీటికి సంబంధించి ఏవైనా పెండింగ్‌లో ఉంటే అనుమతులు ఇచ్చి పనులు వేగవంతం చేయాలి. 
► పట్టణ, నగరాల్లోని వైఎస్సార్‌ క్లినిక్స్‌కు సంబంధించి రేపటికి మ్యాపింగ్‌ చేయబోతున్నారు. వీటికి స్థలాలను గుర్తించే పనిని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి ఉంటుంది. 
► అంగన్‌వాడీ కేంద్రాలు కూడా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నాయి. 55 వేల అంగన్‌వాడీల్లో 31 వేల చోట్ల కొత్త బిల్డింగులు కట్టాలి. మిగిలిన వాటిలో మరమ్మతులు చేయాలి. వీటిలో కూడా నాడు–నేడు కింద కార్యక్రమాలు చేపడుతున్నాం. వీటిపై కూడా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. 
 
కోవిడ్‌–19పై ప్రజల్లో అవగాహన పెంచాలి
► కోవిడ్‌–19 వ్యాప్తిని అరికట్టడంలో కలెక్టర్లు చాలా బాగా పని చేశారు. వలంటీర్లు, ఆశాలు, ఏఎన్‌ఎంలు,  నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, వైద్యులు, మున్సిపల్‌ సిబ్బంది, శానిటరీ వర్కర్లు.. అందరూ చాలా బాగా పని చేశారు. 
► కరోనా వైరస్‌ విషయంలో దేశంలో పాజిటివిటీ రేటు 6 శాతం అయితే రాష్ట్రంలో 1 శాతం ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని రకాల వెసులుబాట్లు ఇచ్చారు. అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో కోవిడ్‌తో ఎలా కలిసి బతకాలన్న దాని గురించి మనం ఆలోచించాలి. 
► 85 శాతం కేసులు ఇంట్లోనే మందులు తీసుకోవడం ద్వారా తగ్గిపోతాయి. కేవలం 2 శాతం కేసుల్లో మాత్రమే మరణాలు ఉంటున్నాయి. ఆస్పత్రుల సన్నద్ధతను కలెక్టర్లు పర్యవేక్షించాలి. ఐసోలేషన్‌ ఫెసిలిటీస్‌ మీద కూడా దృష్టి పెట్టాలి. 

సచివాలయాల ఉద్యోగులపై జేసీ దృష్టి పెట్టాలి
► గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులపై సంబంధిత జేసీ దృష్టి పెట్టాలి. పనీతీరుపై, ప్రజలకు అందుతున్న సేవలపై రోజూ సమీక్ష నిర్వహించాలి. వారికి శిక్షణ ఇవ్వాలి. ► స్పందన కింద వచ్చే వినతులను జాగ్రత్తగా పర్యవేక్షించడం మొదలుపెడితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి సచివాలయంలో లబ్ధిదారుల జాబితా అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. 
► ఫిర్యాదులు, సలహాలు, సూచనల కోసం ఇచ్చిన అతి ముఖ్యమైన నంబర్లు, సచివాలయాల్లో అందే సేవల గురించి గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పకుండా డిస్‌ ప్లే కావాలి. అలాగే ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుందో తెలిపేలా ప్రకటించిన సంక్షేమ క్యాలండర్‌నూ ప్రదర్శించాలి. 
► లబ్ధిదారులకు బియ్యం కార్డులు, పింఛన్‌ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులను డోర్‌ డెలివరీ చేయాలి. బయోమెట్రిక్‌ అక్నాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవాలి. 
► ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.  

మద్యం, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
► మద్యం వినియోగం తగ్గించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. 43 వేల బెల్టుషాపులు ఎత్తివేశాం. 33 శాతం మద్యం దుకాణాలు తగ్గించాం. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నాం.
► మద్యం విక్రయించే వేళలనూ బాగా తగ్గించాం. పద్ధ్దతి ప్రకారం మద్య నియంత్రణ చేస్తున్నాం. షాక్‌ కొట్టే రీతిలో రేట్లు పెంచాం. 
► ఇవన్నీ చేస్తున్నప్పుడు మద్యం అక్రమ రవాణా, తయారీ జరక్కుండా చూడాలి. బయట రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరక్కూడదు.

🔳ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంJun 10 2020 @ 04:38AM

మంగళ్‌హాట్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): 2020 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం(ఇగ్నో) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ ఎస్‌.ఫయాజ్‌ అహ్మద్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు

జూలై 12న అంబేద్కర్‌ వర్సిటీ అర్హత పరీక్షJun 10 2020 @ 04:37AM

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ అర్హత పరీక్ష-2020ని తెలుగు రాష్ట్రాల్లో జూలై 12న  నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు.

యూజీ పరీక్షలు వాయిదా

అంబేద్కర్‌ వర్సిటీలో వివిధ యూజీ పరీక్షలు వాయిదాపడ్డాయి. బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) మొదటి సెమిస్టర్‌, బీఈడీ (బ్యాక్‌లాగ్‌), ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) పరీక్షలు; బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షలు; డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ (సీబీఎస్‌) పరీక్షలను వాయిదా వేశారు. వీటిని తిరిగి జూలైలో నిర్వహించే అవకాశాలున్నాయి. డిగ్రీ ఓల్డ్‌ బ్యాచ్‌ విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు పూర్తి వివరాలతో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.